
చౌటుప్పల్, తొలివెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఆదర్శవంతమైన వివాహం చేసుకొని సమాజానికి మంచి సందేశం ఇచ్చారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన సుర్కంటి సుధాకర్ రెడ్డి కూతురు, యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డి, కడప జిల్లా చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డిని శనివారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. దండలు మార్చుకొని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ ద్వారా జరిగిన ఈ వివాహం అందరి ప్రశంసలను పొందింది.

ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రిని రెడ్డి, ఐఏఎస్ శిక్షణలో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని వివాహం చేసుకోవడం విశేషం. ఆడంబరాలు, ఖర్చులకు దూరంగా నిరాడంబరంగా నిర్వహించిన ఈ వివాహం యువతకు, సమాజానికి ఆదర్శంగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు అధికారులు, స్నేహితులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సాదాసీదాగా, విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ వివాహం అందరి మనసులను ఆకట్టుకుంది.
