ముగిసిన నామినేషన్ల పరిశీలన
– 126 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమం
– ఎన్నికల అధికారి జి. వెంకటరామ్ రెడ్డి

చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) శనివారం పూర్తయింది. స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రక్రియను రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) స్వయంగా పర్యవేక్షించారు.

మొత్తం 20 వార్డుల నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 126 మంది అభ్యర్థులు 191 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అధికారులు అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు, సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించిన అనంతరం 126 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించారు.

ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో అభ్యర్థుల సమక్షంలోనే ఈ స్క్రూటినీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు మధ్య పరిశీలనను పూర్తి చేశారు.
ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు ఆర్డీఓ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరామ్ రెడ్డి తెలిపారు.
