రైతు వేదికలకు భద్రత ఏది?
– నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిన వేదికలు
– నిఘా లేక అపహరణకు గురవుతున్న విలువైన సొత్తు
– పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు

వలిగొండ, తొలివెలుగు : రైతన్నలకు సాగులో సలహాలు, సూచనలు అందిస్తూ వ్యవసాయాధికారులకు అనుసంధాన వేదికలుగా నిలవాల్సిన ‘రైతు వేదికలు’ నేడు రక్షణ కరువై వెలవెలబోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా ఈ భవనాలు దొంగలకు అడ్డాగా మారుతున్నాయి. ఊరికి దూరంగా, శివారు ప్రాంతాల్లో నిర్మించిన ఈ వేదికల్లో భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో విలువైన సామగ్రి మాయమవుతోంది.
అదును చూసి అపహరణ..
వలిగొండ మండలంలో మొత్తం 10 రైతు వేదికలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు నేస్తం’ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు దృశ్య మాధ్యమం ద్వారా రైతులతో నేరుగా ముచ్చటించేందుకు వీలుగా ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి పరికరాలను సమకూర్చింది. ముఖ్యంగా మండల కేంద్రంలోని వేదికలో 62 అంగుళాల భారీ టీవీ సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిపై సరైన నిఘా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వైఫల్యానికి ప్రధాన కారణాలు:
విసిరేసినట్టుగా నిర్మాణాలు: మెజారిటీ రైతు వేదికలు ఊరికి దూరంగా ఉండటంతో రాత్రి సమయాల్లో అక్కడ జనసంచారం ఉండటం లేదు. దీన్ని అదనుగా తీసుకుంటున్న దుండగులు సునాయాసంగా చోరీలకు పాల్పడుతున్నారు.
నిఘా నేత్రాల కరువు: ఏ ఒక్క రైతు వేదిక వద్ద కూడా సీసీ కెమెరాలు లేవు. దీంతో దొంగతనాలు జరిగినప్పుడు విచారణ చేపట్టడం పోలీసులకు సవాలుగా మారుతోంది.

పర్యవేక్షణ లోపం: క్లస్టర్ ఏఈవోల నియంత్రణలో ఉండాల్సిన ఈ వేదికల భద్రతను అధికారులు గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన చోరీలపై సరైన విచారణ జరగకపోవడంతో దొంగలకు మరింత బలం చేకూరుతోంది.
లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ ఆస్తులు దుర్వినియోగం కాకముందే, ఉన్నతాధికారులు స్పందించి కనీసం సీసీ కెమెరాలైనా ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
