చౌటుప్పల మున్సిపాలిటీలో సీపీఎం అభ్యర్థుల పోటీ
— పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే గెలిపించాలి
— పదవులు ఆభరణం కాదు.. పోరాటానికి ఆయుధం
— సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్

చౌటుప్పల, తొలివెలుగు : చౌటుప్పల మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడగల కమ్యూనిస్టులకే ప్రజలు తమ ఓటు వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్ పిలుపునిచ్చారు.
శనివారం చౌటుప్పల మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యుడు రాగిరు కిష్టయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎండీ జాహంగీర్ మాట్లాడుతూ.. నేటి రాజకీయాలు వ్యాపారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని, ప్రజా సమస్యలను విస్మరించే నాయకులు ప్రలోభాలతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు.
పదవులు ఆభరణాలు కావని, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే ఆయుధాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల తరఫున నిలబడి ఉద్యమాలు నిర్వహించే పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులకే ప్రజలు తమ ఓటు వేయాలని కోరారు. చౌటుప్పల మున్సిపాలిటీలో నెలకొన్న అనేక సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించిన ఘనత సీపీఎం పార్టీదేనని ఆయన గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, జి. శ్రీనివాస్ చారి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశం, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మండల కార్యదర్శివర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి, చింతల సుదర్శన్, బోయ యాదయ్య, మండల కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, అంతటి అశోక్, కొండే శైలం, ఎలమల్ల సంజీవ, మీసాల శీను, కొంతం సుశీల, రోడ్డ సోని తదితరులు పాల్గొన్నారు.
